Sunday, March 29, 2020

విద్యార్థులు-స్టార్టప్ - iVE-IN పథకం

పరిశోధనలు, ఆవిష్కరణలు, పెట్టుబడులు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. వీటికి ఇటీవల కాలంలో విపరీతంగా ప్రాధాన్యం పెరుగుతోంది.
Bavithaఇటీవల విద్యార్థులు మొదలు.. ప్రొఫెసర్లు, స్టార్టప్ ఔత్సాహికుల వరకు.. పరిశోధనలు, ఆవిష్కరణల వైపు దృష్టి సారిస్తున్నారు. మరోవైపు తమ సరికొత్త ఆవిష్కరణలకు ఉత్పత్తుల రూపం ఇచ్చి.. ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారాలని యువత తపన! కానీ...సరైన మార్గాలు తెలియని పరిస్థితి! ఇలాంటి వారికి.. చేయూతనందించేందుకు కొత్త పథకంతో ముందుకొచ్చాయి దేశంలోని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు.. ఐఐటీలు, ఐఐఎంలు! ఇందుకోసం.. ఈ ఇన్‌స్టిట్యూట్‌లు సంయుక్తంగా.. iVE-IN (ఇన్నోవేషన్, వెంచరింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ ఇండియా నెట్‌వర్క్) పేరుతో.. తాజాగా ఒక కొత్త ప్రత్యేక పథకానికి శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో.. ఐవెయిన్ పథకం ప్రత్యేకతలు, లక్ష్యాలు, విధి విధానాలపై విశ్లేషణ...

పరిశోధనలకు ఊతం..
ఐఐటీలు, ఐఐఎంల్లో పరిశోధనలు, వాటి ఆధారంగా నూతన ఆవిష్కరణల దిశగా ప్రయత్నాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఆయా రీసెర్చ్ కార్యకలాపాల్లో పాల్పంచుకునే అవకాశం సదరు ఇన్‌స్టిట్యూట్స్‌లోని విద్యార్థులు, ప్రొఫెసర్లకు మాత్రమే లభిస్తోంది. మరెంతోమందికి రీసెర్చ్, ఇన్నోవేషన్‌పై ఆసక్తి ఉన్నా.. సరైనమార్గం గురించి అవగాహన ఉండటం లేదు. దాంతో ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ విద్యలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన విద్యాసంస్థలైన ఐఐటీలు, ఐఐఎంలు భావించాయి. ఆ క్రమంలో ఐఐటీలు, ఐఐఎంల కన్సార్షియం తాజాగా ఇన్నోవేషన్, వెంచరింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ ఇండియా నెట్‌వర్క్(ఐవెయిన్) పేరుతో ప్రత్యేక పథకానికి రూపకల్పన చేశాయి. దీని ద్వారా ఐఐటీలు, ఐఐఎంలకు చెందిన విద్యార్థులు, ప్రొఫెసర్లు మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇన్‌స్టిట్యూట్స్ కు చెందిన ఔత్సాహిక పరిశోధకులకు చేయూత లభిస్తుంది. తద్వారా దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎకో సిస్టమ్‌కు ఊతం లభిస్తుందని భావిస్తున్నారు.

అయిదు ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి వ్య‌వ‌స్థాప‌క సభ్యులు
ఐవెయిన్ ప్రోగ్రామ్‌కు రెండు ఐఐటీలు(చెన్నై, ముంబై), మూడు ఐఐఎం (బెంగళూరు, కోల్‌కత, కోజికోడ్)లకు చెందిన ఫ్యాకల్టీ సభ్యులు వ్యవస్థాపక సభ్యులుగా వ్యవహరిస్తారు. వీరే ఈ పథకానికి సంబంధించిన అన్ని రకాల విధి విధానాల రూపకల్పన, సమీక్ష, తుది నిర్ణయం వంటివన్నీ చూస్తారు.

పథకం ప్రధాన లక్ష్యం ఇదే..
ఐవెయిన్ పథకం ప్రధానంగా నాలుగు లక్ష్యాలను నిర్దేశించుకుంది. అవి..
  • పరిశోధన నైపుణ్యాలకు సంబంధించి ఇంటర్ డిసిప్లినరీ కార్యవర్గాన్ని రూపొందించడం, దాని ద్వారా విధాన నిర్ణేతలు, అకడమిక్ వర్గాలు, పరిశోధకులు, ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇన్నోవేటర్స్, స్టూడెంట్స్‌కు అవసరమైన సహకారం అందించాలి.
  • దేశంలో ఇన్నోవేషన్, వెంచరింగ్(పెట్టుబడులు), ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెగ్మెంట్స్ పరిస్థితులను గుర్తించి.. కీలకమైన విభాగాలకు అవసరమైన అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాలి.
  • పలు స్థాయిల్లో విధాన నిర్ణయాలను సమర్థంగా రూపొందించడంలో, అమలు చేయడంలో సహకరించాలి.
  • వార్షిక కాన్ఫరెన్స్‌లు, జర్నల్ రూపకల్పన, డేటా సమూహాన్ని రూపొందించే క్రమంలో అకడమిక్ సొసైటీ ఏర్పాటు చేయాలి.

ప్రతిపాదనల ఆధారంగా..
  • అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న రంగానికి సంబంధించిన వివరాలతో ప్రతిపాదనలను పంపించాలి. ఇలా పంపిన ప్రతిపాదనలను ఐవెయిన్ రిపోర్ట్‌లో పొందుపరుస్తారు.
  • పరిశోధకులు పంపే ప్రతిపాదనలు నిర్దిష్టంగా కొన్ని విభాగాలకు సంబంధించి ఉండాలని ఐఐటీలు, ఐఐఎంలు నిర్ణయించాయి.
  • ఐవెయిన్-2020 రిపోర్ట్‌లో నిర్దేశించిన థీమ్‌కు సంబంధించిన అంశాలపైనే ప్రతిపాదనలు పంపాలి. అవి ఇన్నోవేషన్‌లో ఇండస్ట్రీ ట్రెండ్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో పెట్టుబడులకు సంబంధించి ఉండాలి.
  • పరిశోధకులు తాము గుర్తించిన ఆవిష్కరణలు/పరిష్కారాలు పూర్తిగా సంబంధిత డేటా ఆధారంగా రూపొందించాల్సి ఉంటుంది.
  • నివేదికల రూపకల్పనలో భారతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి..
  • పరిశోధకులు, అకడమిక్ వర్గాలే కాకుండా.. ఇన్నోవేషన్, వెంచర్ ఎకో సిస్టమ్‌కు సంబంధించి ఇతరులు కూడా తమ ప్రతిపాదనలు, పబ్లికేషన్స్ పంపించొచ్చు.

No comments:

Post a Comment